నిర్మల్
అకౌంట్లో నుండి హుండీలోకి “ఈ ఆన్లైన్ హుండీ” సేవలు


ఇక నుండి బాసర ఆలయంలో ఈ ఆన్లైన్ హుండీ సేవలు
ఇ- హుండీ సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
జనం వెలుగు, బాసర;- ఆన్ లైన్ లో బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ, ఇ- హుండీ సేవలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతోపాటు వారి సౌకర్యార్ధం ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్లో పూజలు, వసతి బుకింగ్, ప్రసాదం పంపిణీ, తదితర సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆన్ లైన్ సేవల వల్ల అమ్మవారి సేవలను భక్తులు పారదర్శకంగా, సులభంగా పొందగలుగుతారని చెప్పారు. భక్తులకు సేవలు నేరుగా ఉండిలోనే వేయడం కాకుండా ఆన్లైన్లో కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అదే విధంగా ఇ- హుండీ సేవలను కూడా భక్తులకు అందుబాటులోకి తెచ్చామని, డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగినందు వల్ల భక్తుల సౌకర్యార్ధం ఈ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నామని తెలిపారు. పేటీయం, ఫోన్ పే, జీ పే లాంటి యూపీఐల ద్వారా హుండీ కానుకలు చెల్లించవచ్చన్నారు. అనంతరం ఆలయంలోని గర్భగుడి వెడల్పు ఇప్పటికే దేవదాయ శాఖ ఇంజనీర్ బృందం కొలతలను కూడా తీసుకోవడం జరిగిందని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని వారు తెలిపారు. అంతకు ముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోరేపల్లి విజయలక్ష్మి బాసర సర్పంచ్ లక్ష్మణరావు టిఆర్ఎస్ నాయకులు, ఆలయ ఈవో విజయ రామారావు, ఇంజనీరింగ్ సూపర్డెంట్ మల్లికార్జున్రెడ్డి, స్థపతి, వల్లినాయగం, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








