నిజామాబాద్
మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి


మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, జూన్ 16: మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రసవాల సందర్భంగా మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, నిశిత పర్యవేక్షణ జరపాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతా శిశు మరణాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది.
ఇటీవలి కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న మాతాశిశు మరణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ ఆసుపత్రిలో సంఘటన చోటుచేసుకుంది, మరణం సంభవించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటీ, వైద్య సేవలలో ఏమైనా లోపం జరిగిందా అని ఆరా తీస్తూ, రికార్డులను పరిశీలించారు. మాతాశిశు మరణాలు జరగకుండా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడ సంఘటన జరిగినా లోతుగా పరిశీలన జరుపుతామని, నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించినట్టు వెల్లడి అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరుపుతూ, అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. వారు పుట్టింటికి వెళ్ళిన పక్షంలో వారి హెల్త్ రికార్డును అక్కడి అధికారులకు పంపాలని, క్షేత్రస్థాయిలో ఆశాలు,
అంగన్వాడీలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, వారి ఇళ్ళను సందర్శించి ఆరోగ్య స్థితిని వాకబు చేయాలని అన్నారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో తప్పనిసరిగా తగిన పరిజ్ఞానం కలిగిన నిపుణులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, వైద్య పరీక్షలు, చికిత్సలు అందించే విషయంలో ఎలాంటి లోపం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రక్త హీనత, బీ.పీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని, అవసరమైన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ, ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడాలని సూచించారు. కాన్పు సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో తల్లి మరణిస్తే, బాధిత కుటుంబం చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ,టి.వినయ్ డీ.సీ.హెచ్.ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, కమిటీ సభ్యుడు బుస్స ఆంజనేయులు, స్వంచ్చంధ సంస్థల ప్రతినిధులు, సంబంధిత వైద్యాధికారులు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్
టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి


టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి
నిజామాబాద్ ఆర్ టి సి నూతన డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి బాధ్యతల చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా భాద్యతలు చేపట్టిన వెంటనే పి. జ్యోతి నిజామాబాద్ బస్ స్టేషన్, డిపోలను సందర్శించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, టికెటింగ్ విధానం, ప్రయాణీకుల రద్దీ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో పర్సనల్ ఆఫీసర్ పద్మజ, ఏ.ఓ. బి. స్వరూప, నిజామాబాద్ 1 డి ఎం ఆనంద్, నిజామాబాద్ 2 డి ఎం, జి ఎస్ చంద్ర శేఖర్ రెడ్డి, బాన్స్ వాడ డి ఎం రవికుమార్, కామారెడ్డి డి ఎం దినేష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ, నిజామాబాద్ 1డిపో సి ఐ జనాభాయి, ఎం ఎఫ్ వసుంధర, బస్ స్టేషన్ మేనేజర్ శివరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు


ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ బడులలో చేర్పించాలి
ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపు
నిజామాబాద్, జూన్ 17: భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించాలనే సమున్నత ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్కారు బడులలో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు చిత్తశుద్ధితో కృషి కొనసాగుతోందని తెలిపారు. మోపాల్ మండలం బోర్గాం(పి) జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు.
ఈ పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతుండడాన్ని గమనించిన కలెక్టర్ వారితో భేటీ అయ్యారు. తమ పిల్లలను ప్రైవేటు బడుల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల భారం ఎక్కువగా ఉండడమే కాకుండా, ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో సర్కారు బడిలో తమ పిల్లలను చేర్పిస్తున్నామని తల్లిదండ్రులు పేర్కొనగా, ఈ విషయాలను వివరిస్తూ మిగితా వారిని కూడా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని, పదవ తరగతిలో 87 శాతం సగటు ఉత్తీర్ణత సాధించిన బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును ప్రతి విద్యార్ధి సద్వినియోగం చేసుకుని చక్కటి భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.
నాణ్యమైన విద్యా బోధనతో పాటు, అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ప్రభుత్వ బడులలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపుతున్నారని అన్నారు. ఇదివరకు పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుకుంటారనే భావన ఉండేదని, ప్రస్తుతం ఆర్ధిక స్థోమత కలిగిన వారు కూడా నాణ్యమైన విద్య కోసం వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తుండడం శుభ పరిణామమని అన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోటీ తత్వాన్ని పెంపొందించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులలో విద్యా ప్రమాణాలు, బోధనను మెరుగుపరుస్తోందని, ఉపాధ్యాయులకు బోధనా సామర్ధ్యాలను పెంపొందేలా శిక్షణ తరగతులను నిర్వహిస్తోందని గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు,, నోట్ బుక్స్, ఏకరూప దుస్తులతో పాటు అల్పాహారం, మద్యాహ్న భోజనం అందిస్తోందని అన్నారు.
కాగా, బోర్గాం(పి) పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో, బడికి ఆనుకుని ఉన్న స్థలాన్ని సేకరించి పాఠశాలను మరింతగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా తరగతులను సందర్శించి విద్యార్థిని, విద్యార్థుల బోధనా సామర్ధ్యాన్ని పరిశీలించి, బహుమతులు అందజేశారు. బాలబాలికలకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్, మోపాల్ తహసిల్దార్ రేఖ, ఎం.ఈ.ఓ సాయిలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలు


ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలు
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని లోక్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లచే ప్రదానం చేసిన వ్యక్తిగత అత్యధిక రక్తదాన ప్రోత్సహికుడు (Individual Highest Blood Donor Motivator) అవార్డును రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రశాంత్ అందుకున్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లోక రమణ రెడ్డి తరఫున ఈ అవార్డును ఆయన స్వీకరించారు.
ఈ సందర్భంగా నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు ఇలా త్రిపాఠి, ఐఏఎస్ అవార్డు గ్రహీత ప్రశాంత్ను అభినందించారు. జిల్లాలో తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరాయంగా రక్తం అందుబాటులో ఉండేందుకు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సాయాగౌడ్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపే రవీందర్, జిల్లా కార్యదర్శి గోక అరుణ్ బాబు, మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.








