నిర్మల్
మద్యం నిషేధానికి 47వ ఆర్టికల్ కట్టుబడి ఉండాలి


మద్యం నిషేధానికి 47వ ఆర్టికల్ కట్టుబడి ఉండాలి – రాజ్యాంగ పరిరక్షణ వేదిక
జనంవెలుగు, నిర్మల్, అనిల్ గంటాడి: మద్యం బీర్ల ధరలను 15% పెంచడం బహుజన బడుగు వర్గాల ఆర్థిక వనరులను కొల్లగొట్టడమేనని రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ నూనెల ఆచార్య తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, మద్యం నిషేధానికి రాజ్యాంగంలోని 47వ ఆర్టికల్ను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒక్కొక్క బీరుపై 30 నుండి 40 రూపాయల పెంపు ద్వారా నెలకు 300 కోట్లు, సంవత్సరానికి దాదాపు 3600 కోట్ల ఆదాయాన్ని ప్రజల నుంచి గుంజుకుంటోందని విమర్శించారు. దీనివల్ల ముఖ్యంగా కూలీలు, కార్మికులు, రైతులు, నిరుద్యోగ యువకుల కుటుంబాల ఆర్థిక స్థితి మరింత దెబ్బతింటుందని తెలిపారు.
ఆరోగ్యంపై ప్రభావం, ప్రభుత్వ బాధ్యత
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం, ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉండాలని, మత్తుపానీయాలను నిషేధించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావించాలన్నారు. అయితే, ప్రభుత్వమే మద్యాన్ని అధిక ధరలకు అమ్మడం అనైతికమని, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే మార్గాన్ని అవలంబించాలని సూచించారు.
బెల్టు షాపుల నియంత్రణ, డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుపై డిమాండ్
బెల్టు షాపులు విచ్చలవిడిగా నిర్వహించబడుతున్నాయని, వీటిని తక్షణమే నియంత్రించాలని, అలాగే మద్యం అలవాటు నుండి ప్రజలను విముక్తం చేసేలా అన్ని జిల్లా కేంద్రాల్లో డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతోంది.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








