నిర్మల్
ఓటు విలువను అర్థం చేసుకోవాలి – రాజ్యాంగ పరిరక్షణ వేదిక


ఓటు విలువను అర్థం చేసుకోవాలి – రాజ్యాంగ పరిరక్షణ వేదిక
జనం వెలుగు, అనిల్ గంటాడి, నిర్మల్: రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ నూనెల ఆచార్య ఓ పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్లు లంచాలు తీసుకుని ఓటు వేయడం బాధాకరమని పేర్కొన్నారు. అలా చూస్తుంటే, సామాన్య ప్రజలు, నిరక్షరాస్యుల సంగతి దేవుడెరుగు అన్న అనుమానం కలుగుతుందని అన్నారు.
ఈ సందర్భంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఒక ప్రసంగాన్ని గుర్తు చేస్తూ, ఆయన రాజ్యాంగ నిర్మాణంలో ఓటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తీరును వివరించారు. అంబేద్కర్ గారు ఓటు శక్తిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ, ప్రజలు తమ ఓటు విలువను గుర్తించకపోవడం విచారకరం అని అన్నారు.
అంబేద్కర్ పార్లమెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆచార్య కృపాలానీ ముచ్చటిస్తూ, “మీరు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు, ఏమిటి విషయం?” అని అడిగితే, “మొదట రాణి కడుపులో పుట్టినవారు మాత్రమే రాజులు అయ్యేవారు, ఇప్పుడు ఓట్ల ద్వారా ప్రజలు తమ నాయకులను ఎన్నుకునే వ్యవస్థను తీసుకొచ్చా, అందుకే సంతోషంగా ఉన్నాను” అని బాబాసాహెబ్ చెప్పారని ఆయన గుర్తుచేశారు.
దానికి కృపాలానీ స్పందిస్తూ, “మీ ప్రజలు పేదలు, నిరుపేదలు, అడుక్కునే వాళ్లు, అమ్ముడుపోయే వాళ్లు. మేము వారి ఓట్లను కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాం. నీవు ఏమీ చేయలేవు” అని అన్నారట. అప్పుడు అంబేద్కర్ గారు, “నేను ఏమి చేయలేనప్పటికీ, ఓటర్లకు తమ ఓటు విలువ ఏ రోజైతే అర్థమవుతుందో, ఆ రోజు మీకంటే పెద్ద బిచ్చగాళ్లు ఎవ్వరూ ఉండరు” అని సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎన్నికల్లో లంచాలు, మద్యం, బహుమతులు అందించి ఓట్లు కొనే వారిని శిక్షించే చట్టాన్ని రూపొందించకపోవడం పొరపాటుగా భావించవచ్చని శ్రీనివాస్ నూనెల పేర్కొన్నారు. నేటి తరం ఈ లోపాన్ని సవరించి, రాజ్యాంగ సవరణ ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారి పై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు రూపొందించాలి అని ఆయన సూచించారు.
“మంచి పార్లమెంటు, మంచి అసెంబ్లీ ఏర్పడితేనే రాజ్యాంగం పూర్తిగా అమలవుతుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి” అని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కోరుకుంటున్నట్లు తెలిపారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








