Education
సర్కారీ స్కూళ్లలో ఏఐ


సర్కారీ స్కూళ్లలో ఏఐ
జనంవెలుగు, హైదరాబాద్, మార్చి 14:- తెలంగాణ రాష్ర్టంలోని అన్ని జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 15 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) ఏ.ఐ ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఈ విషయమై జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. పాఠశాల విద్యార్థుల పరిజ్ఞానం, నైపుణ్యం పెరిగేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరిలో సర్కార్ బడిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్య బోధన చేసేందుకు గతంలో పైలెట్ ప్రాజెక్టు కింద 6 జిల్లాలో ప్రారంభించారు. వాటిలో మెదక్ జిల్లాలో బూర్గుపల్లి, మాసాయిపేట , నిజాంపేట,తూప్రాన్, కాళ్లకల్, నర్సాపూర్, మండల పరిషత్ ప్రైమరీ స్కూల్స్ఎంపికయ్యాయి. భద్రాద్రి జిల్లాలో హన్మాన్బస్తీ, కేటీపీఎస్ కాలనీ, వికలాంగుల కాలనీ, తాతగుడిసెంటర్, పాలకొయ్య తండా, ఓల్డ్ కొత్తగూడెం ప్రైమరీ స్కూల్, ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్ సీ ఖమ్మం, మల్లెమడుగు, పాండురంగాపురం, సత్తుపల్లి, సింగారెడ్డిపాలెం, రాజేంద్రనగర్ ప్రైమరీ స్కూల్స్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జనతానగర్, కొంపల్లి, ప్రగతి నగర్, మల్లాపూర్, ఎల్లమ్మ బండ, బహదూర్పల్లి, నారాయణపేట్జిల్లాలో గూడె బెల్లూర్, ముడుమల్, కొల్లంపల్లె, దామరగిద్ద, కర్ని, శివాజీ నగర్, వికారాబాద్ జిల్లాలో ఓల్డ్తాండూరు. (తెలుగు మీడియం), దౌల్తాబాద్, కొట్బాస్పల్లి, రేగడ్మేల్వేర్, మల్కాపూర్గని, తాండూర్ (ఉర్దూ మీడియం) స్కూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను అందించే ప్రోగ్రామ్ అమలైంది.అది మంచి ఫలితాలు ఇచ్చినందున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు, అభ్యాస సామర్థ్యాలు పెంపొందించేందుకు ప్రతి జిల్లాలో కొన్ని ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. ఆయా జిల్లాల్లో ముందస్తుగా ఎంపిక చేసిన పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులకు ఏ.ఐ వినియోగిస్తూ సులభతరంగా విద్యా బోధన చేయాలని నిర్ణయించారు. ఏ.ఐ. కోర్సు ద్వారా విద్యార్థులకు బోధన చేసేందుకు వీలుగా ప్రతి పాఠశాలలో ఐదు కంప్యూటర్లు, అవసరమైన ఇంటర్నెట్ కనెక్షన్, హెడ్ ఫోన్స్ ఇతర సామాగ్రి అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. జిల్లాలో ముందుగా ఎంపిక చేసిన పాఠశాలలో ఏ ఏ కోర్సు ద్వారా విద్య బోధన జరుగుతుందని, ఇక్కడ వచ్చే ఫలితాలను అంచనా వేస్తూ భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇక ఏఐ ద్వారా విద్యార్థి సామర్థ్యం పెంపొందించే విషయంలో ఏఐ ముఖ్య భూమిక పోషించనుంది. వారి సామర్థ్యం మెరుగుపరిచే విధానంలో ఏఐ ఎంతగానో ఉపయోగపడనుంది.
Education
|nandipet భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి


భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనల అంశాలపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి యువతరం ఖచ్చితమైన దృఢ సంకల్పాలు, సరైన అవగాహనలు లేక వారి భవిష్యత్తుకు మార్గం వెతుక్కోవడం లేదని, విలాసాల కొరకు రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యపరంగా, సామాజికపరంగా తప్పులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారని, అటువంటి యువత మంచి సన్మార్గంలో నడిచేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాబోయే భవితరం మీదేనని, దాని కొరకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
కలలు కంటే కళ్ళ ముందుకు ఏదీ రాదని, ఆ కళల సహకారం కొరకు కష్టపడితేనే విజయం కాళ్ల ముంగటికి నడిచొస్తుందని వివరించారు, ప్రతి ఒక్కరూ మనకన్నా ఉన్నత శిఖరాలను జయించిన వారిని ఆదర్శంగా తీసుకొని, శ్రమించాలని అప్పుడే మన పై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషులకు మనపై నమ్మకం పెరిగి మనకు సహకారం అందిస్తారని తెలిపారు.
సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే సత్తా కలిగి ఉండాలని. అప్పుడే ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారని గుర్తు చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్, మండల కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెచ్ జె డబ్ల్యూ హెచ్ఆర్సీ సంస్థ జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీధర్, నిజాంబాద్ జిల్లా వైస్ చైర్మన్ కట్ట రాజు, నoదిపేట మండల చైర్మన్ సంజీవ్, హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, కళాశాల అధ్యాపకులు అధ్యాపకురాల్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Education
| balkonda పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు


పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు
జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు తీయించారు. అదే విధంగా పొలంలో వచ్చే రోగాలు, కలుపు నివారణలపై విద్యార్థులకు పిల్లలకు వొకేషనల్ శిక్షణలో వివరించి చెప్పడం జరిగింది. విద్యార్థులకు పొలంలో కలుపును ఎలా తియ్యాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, కౌమూది తదితరులు పాల్గొన్నారు.
Crime
రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి


రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయిన ఉపాధ్యాయుడు చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలిగిచూసింది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి కొట్టిన ఘటన ఆగస్టు 19న చోటుచేసుకున్నా ఇప్పటివరకు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించకపోవడం స్థానికులను కలవరపెడుతోంది. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, అదే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ అయినప్పటికీ పరిస్థితి మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానోపాధ్యాయుల భర్త డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడనే అండతో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు. ఘటన జరిగిన రోజు నుండి ఇప్పటివరకు ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదని, శనివారం పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు. ఇంతటి దారుణ సంఘటన జరిగినా మండల విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంద, మండల వైద్యాధికారి, ఉపాధ్యాయులపై సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎంఇఓను చారవాణిలో సంప్రదించగా ఘటన వాస్తవమేనని తెలిసిందని ఈ రోజు వెళ్లి విచారించి నివేదిక పంపిస్తామని చెప్పారు. గ్రామస్తులు ఉపాధ్యాయుడిపై భౌతిక దాడి జరిగే ప్రమాదం ఉందని, అందుకే అతడిని పాఠశాల నుండి వెళ్లిపోమని చెప్పినట్లు వివరించారు.








