నిజామాబాద్
రోడ్డు ప్రమాదాల నివారణకు స్వీయ నియంత్రణ తప్పనిసరి


రోడ్డు ప్రమాదాల నివారణకు స్వీయ నియంత్రణ తప్పనిసరి
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే పెరుగుతున్న ప్రమాదాలు
రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్
జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 15: నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని రాష్ట్ర రవాణా, బీ.సీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం నిజామాబాద్ శివారులోని సుగుణ గార్డెన్స్ లో పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్-అలైవ్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎం.డీ నాగిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తగా, అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం చేకూరుస్తున్నారని, ఎవరికివారు తమవంతు బాధ్యతగా భావిస్తూ ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని హితవు పలికారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని, తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ చలానాలు విధించినా, ఎన్ని చట్టాలు వచ్చినా, ప్రభుత్వ యంత్రాంగం ఎంతటి కఠిన చర్యలు చేపట్టినా కూడా, ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రానంతవరకు రోడ్డు ప్రమాదాల పరిస్థితిలో మార్పు రాదని అభిప్రాయపడ్డారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్-అలైవ్ లో భాగంగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని గుర్తు చేశారు.
ఇదిలాఉండగా, నిజామాబాద్ జిల్లాకు త్వరలోనే కొత్త బస్ డిపో రానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ప్రతిరోజూ 10వేల బస్సులు సుమారు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ, 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రవాణా శాఖ పరంగా కూడా చెక్ పోస్టులు ఎత్తివేయడం వంటి అనేక నూతన సంస్కరణలను అమల్లోకి తెచ్చామని గుర్తు చేశారు.
రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలలో మన దేశంలో ప్రతి ఏటా లక్షా 50 వేల మంది, రాష్ట్రంలో 7వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. వీటిలో సుమారు 45శాతం వరకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను విధిగా పాటించి ప్రమాదాలకు నియంత్రించేందుకు కృషి చేయాలన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్యలు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ టేక్ చేయడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆటోలలో సామర్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ చేయడం తదితర కారణాల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ప్రమాదాల సంఖ్య పెరిగేందుకు కారణమవుతోందని అన్నారు. అతివేగాన్ని మానుకోవాలని, రోడ్డు భద్రతా నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎంతో అప్రమత్తతో వాహనాలు నడపాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి బాధితులు వెల్లడిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. అతి వేగం, అజాగ్రత్తగా వాహనాలు నడిపి తమ లాంటి దుస్థితిని కొని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేయడం అందరినీ ఆలోచింపజేసింది. రహ్ వీర్, పీ.ఎం రాహత్, హిట్ అండ్ రన్ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటు, ప్రోత్సాహకాలపై ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు వీలుగా రూపొందించిన గోడ ప్రతులను, కర పత్రాలను మంత్రి ఆవిష్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, డాక్టర్ కవితా రెడ్డి, డీటీసీ దుర్గా ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
| nandipet ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం


ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం
జనంవెలుగు, నందిపేట్:- ప్రజా పాలనలో భాగంగా గురువారం నందిపేట మండల కేంద్ర సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే నినాదంతో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఏడి శ్రీనివాసులు పాల్గొన్న ఈ సమావేశానికి వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మండల పాలన సిబ్బంది హాజరయ్యారు,
ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది కూడా పాల్గొని అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను ఎలా నివారించవచ్చో, గ్యాస్ సిలిండర్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలో అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా చేసి చూయించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.., ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం అనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాప పాలన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగిందని, అందులో భాగంగానే ఈరోజు మండల స్థాయి సమావేశం జరుపుకుంటున్నామన్నారు.
ప్రజాభివృద్ధి కొరకు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకొని వారికి మంచి ఫలితాలను అందించేందుకే ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ ప్రజా పాలన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా సహకరించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.
మండల కేంద్ర సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రజా పాలన కార్యక్రమానికి అద్భుత ఫలితాలు వస్తున్నాయని, ఎందుకంటే గ్రామ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై ప్రజాపాలనలో సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి తక్షణమే
నిర్ణయం తీసుకోవడం వల్ల పరిష్కారం దొరుకుతుందని, లబ్ధిదారులకు అధికారులకు వారధిగా ఈ ప్రజా పాలన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. తాసిల్దార్ సంతోష్ రెడ్డి, ఆర్ ఐ, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్
|nizamabad పనుల్లో వేగం పెంచాలి


పనుల్లో వేగం పెంచాలి
* యూజీడీ కనెక్షన్ పనులను పర్యవేక్షించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…
ఇందూరు: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి ఇంటి నుంచి ఇచ్చే కనెక్షన్ల పనుల్లో వేగం పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్ లో గురువారం యుజిడి అనుసంధాన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన చోట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో కనెక్షన్ లు ఇస్తున్నారన్నారు.
నగరవాసులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇంటి యజమానులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సరైన పద్ధతిలో పనులు పూర్తి చేయాలన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పనులు చేసే బృందాలని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు ఇపకాయల సుమిత్రా కిషోర్, మఠం పవన్, చింతకాయల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
|Armoor సిబిఎస్ఇ పదో తరగతి ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం


సిబిఎస్ఇ పదో తరగతి ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం
జనం వెలుగు ఆర్మూర్:- నిన్న వెలువడిన సిబిఎస్ఇ 2025- 2026 పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో క్షత్రియ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డా. విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించబడిన విద్యార్థుల అభినందన కార్యక్రమం లో విద్యార్థులు తమ స్వీయ అను భవాలను, అధ్యాపకుల కృషిని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏనుగు ప్రణతి 483/500 మార్కులతో ప్రథమ స్థానం, ముకుంద్ హర్షిణి 462/500 మార్కులతో ద్వితీయ స్థానాన్ని (బెస్టాఫ్ 5 ఔట్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్) పొందినారు.
ఈ సందర్భం గా స్కూల్ ప్రిన్సిపాల్ డా. విజయ లక్ష్మి మాట్లాడుతూ 100 శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలను సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రాబోయే రోజుల్లో స్ఫూర్తి వంత మైన ప్రణాళికను రూపొందించుకొని మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ చదువుతో పాటు సంస్కారాన్ని పాటిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
స్కూల్ కరెస్పాండెం ట్ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య, సంస్కారవంతమైన నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో క్షత్రియ పాఠశాలను స్థా పించమని జరిగిందని అన్నాడు. ఇట్టి ఫలితాలకు విశేష కృషికి పాటుపడిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించాడు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కోశాధికారి అల్జా పూర్ గంగాధర్, డైరెక్టర్ అల్జాపూర్ వీరేందర్, అధ్యాపాక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.








